ఓ నవ్వు స్వర్గానికి తరిలింది
నమస్కారం..ఇక్కడెవరో లక్ష్మి పతి అని పరమ పీనాసి వెధవ ఉన్నాడట ఆయన ఇల్లు ఎక్కడో తెలుసా..
ఇదే ఇల్లు..నేనే లక్ష్మీ పతిని..ఎవరు మీరు
ఆహా..మీకు తెలియదా..వాడు పరమ దరిద్రుపుకొట్టు వెధవని,ఎవరిని అడిగినా చెప్తారని చెప్పారే మాకు
ఏవండోయ్..ఇక తిట్టకండి..నేనే ..నేనే లక్ష్మీ పతిని
ఓహోహో..మీరేనా..ఆ మొహం చూడగానే నాకు అనుమానం వచ్చింది సుమండీ...
అంటూ చెవిటివాడుగా కనిపించిన గుండు హనుమంతరావు...లక్ష్మిపతి కోట శ్రీనివాసరావుని హడలెత్తిస్తాడు. ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఇలాంటి కామెడీ సీన్ ని తొలి చిత్రం(విడుదలైన) లోనే చేసి,పండించి ఇండస్ట్రీలో ఎవర్రా ఇతను అని పిలిచి ఆఫర్స్ ఇచ్చేలా చేసుకున్నాడు. దాంతో దాదాపు ఓ దశాబ్దం వరకూ బిజీ అయ్యిపోయాడు. నాలుగు వందల సినిమాల దాకా కెరీర్ నత్త నడక లేకుండా పరుగులెత్తింది. ‘అహ నాపెళ్లంట’ విజయం తర్వాత.. మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, టాప్ హీరో, కొబ్బిరి బోండాం, బాబాయ్ హోటల్, శుభలగ్నం, క్రిమినల్, పెళ్లాం ఊరెళితే తదితర చిత్రాల్లో అద్భత నటన కనబర్చారు.. ఓ టైమ్ లో బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, కోట శ్రీనివాసరావు లేని సినిమా లేదు అనే స్దాయి వచ్చింది.
సినిమాలు కాస్త తగ్గుతున్నాయనగానే టీవి రంగంవైపు ప్రయాణం పెట్టుకున్నారు. పలు టీవీ సీరియల్స్లో నటించారు. ఆయన నటించిన అమృతం సీరియల్ అత్యంత ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ముఖ్యంగా అమృతం సీరియల్ లో అంజి పాత్రలో ఆయన అందరికి గుర్తుండిపోయారు. మూడుసార్టు టీవీ నందులు అందుకున్నారు.
1956లో కాంతారావు, సరోజిని దంపతులకు హనుమంతరావు జన్మించారు. 1974లో నాటకరంగం వైపు ఆకర్షితుడయ్యాడు. నాటకాల్లో ఆయన వేసిన మొదటి వేషం రావణబ్రహ్మ. అదే సమయంలో స్టేజి షోలతోనూ బాగా పాప్యులర్ అయ్యారు. 1985లో మద్రాసులో వేసిన ‘ఇదేమిటి’ అనే నాటకానికి ఛీఫ్ గెస్ట్ గా వచ్చిన దర్శకులు జంధ్యాల.. గుండు హనుమంతరావు నటనకు మెచ్చి ఆయనకు అహనా పెళ్లంట చిత్రంలో అవకాశం ఇచ్చారు.
కామెడీ రాయటం ఎంత కష్టమో...దాన్ని తెరపై పండించటం అంతకు రెట్టింపు కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకున్ని నాణ్యమైన నవ్వులు పంచటమే పనిగా పెట్టుకుని ఎన్నో సంవత్సరాలు పాటు టాలీవుడ్ లో హాస్యనటుడుగా వెలిగిన వ్యక్తి గుండు హనుమంతరావు. ఆయన మృతికి రాగలహరి నివాళులు అర్పిస్తోంది.